కుప్పకూలిన హైదరాబాద్ సీబీఎస్ డోమ్!

  • దశాబ్దాలపాటు సేవలందించిన సీబీఎస్
  • గత కొన్నాళ్లుగా నిరుపయోగంలో
  • ఈ ఉదయం కూలిన డోమ్
దశాబ్దాల పాటు హైదరాబాద్ బస్టాండుగా సేవలందించి, ప్రస్తుతం సిటీ బస్టాండ్ గా ఉన్న సీబీఎస్ (సెంట్రల్ బస్ స్టేషన్) డోమ్ ఈ ఉదయం కుప్పకూలింది. గౌలిగూడలో మూసీ నది పక్కన ఉన్న ఈ భారీ డోమ్ కూలిన ఘటనలో కొందరికి స్వల్పగాయాలు అయినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోమ్ కూలిపోతుందని గత కొన్నాళ్లుగా దానిలో బస్సులను ఆపడం లేదు.

దీన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అధికారుల వద్ద ఉన్నాయి. దానిపై నిర్ణయం తీసుకునేలోపే డోమ్ కూలడం గమనార్హం. మూసీ నది మధ్యలో ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) నిర్మించిన తరువాత, హైదరాబాద్ బస్టాండును సీబీఎస్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల వేళ, అధిక రద్దీని తట్టుకునేందుకు సీబీఎస్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడుపుతూ ఉండేవారు.
Go Back to Shorts
Hyderabad
CBS
MGBS
Dome

More Telugu News